హైదరాబాద్: కార్యకర్తల కుటుంబాలకు టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి 60లక్షల మంది సభ్యత్వం ఉండడం గర్వకారణమని, దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి కూడా ఇంత పెద్ద ఎత్తున సభ్యత్వం లేదన్నారు. మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు మంత్రి కేటీఆర్ ఇవాళ తెలంగాణ భవన్లో బీమా చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..'ఈసారి బీమా కింద 1,581 మందికి రూ.31కోట్ల 62 లక్షల చెక్కులు అందించాం. మిమ్ములను కలుసుకోవడం కొంత బాధగా ఉన్నా పార్టీ తరఫున మీకు అండగా ఉంటున్నందుకు సంతోషంగా ఉంది. 60లక్షల మంది కార్యకర్తలను సీఎం కేసీఆర్ కడుపులో పెట్టి చూసుకుంటారు. దేశంలో ఒకటి రెండు పార్టీలు మాత్రమే బీమా సౌకర్యం కల్పిస్తున్నాయి. 60లక్షల మంది కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్ కంపెనీకి రూ.11.50కోట్లు చెల్లించాం. టీఆర్ఎస్ అధికారంలో ఉందంటే లక్షలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తల కృషి ఉంది. త్వరలోనే మిగతా వారికి ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి చెక్కులు అందజేస్తారని' పేర్కొన్నారు.

Source: https://www.ntnews.com/hyderabad-news/ktr-distributes-bheema-cheques-in-telangana-bhavan-1-1-10609170.html