ఇసుక కొరతపై సీఎం వైయస్.జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు క్యాంపు కార్యాలయంలో రోడ్లు, భవనాలశాఖ సమీక్షా సమావేశం నిర్వహించిన జగన్ ఇసుక అన్నది తాత్కాలిక సమస్య అని పేర్కొన్నారు. 90 రోజులుగా ఊహించని రీతిలో వరద వస్తోందన్న ఆయన ఆ కారణంగా 265 రీచ్ల్లో కేవలం 61 మాత్రమే పనిచేస్తున్నాయని అన్నారు. మిగతా రీచ్లన్నీ వరదనీటిలో ఉన్నాయని, అక్కడ నుంచి ఇసుక తీయడం కష్టంగా ఉంది, లారీలు, ట్రాక్టర్లు వెళ్లలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. 90 రోజులుగా కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి చివరకు పెన్నా నదిలో కూడా వరద వస్తోందనిమ్ ఇలా నీళ్లు రావడం రైతులకు, పంటలకు, భూగర్భజలాలకు మంచిదే, కానీ నిరంతరం వరద రావడం వలన ఇసుక సమస్య వస్తోందని పేర్కొన్నారు.
గత ఐదేళ్లుగా ఇసుక మాఫియా నడిచిందని, పొక్లెయిన్లతో, భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేశారని కానీ ఇప్పుడు మాన్యువల్గా చేస్తున్నామని అన్నారు. ఇప్పుడు ప్రకాశం బ్యారేజీకి వెళ్లిచూసినా గేట్లు ఎత్తే ఉన్నాయి, వరదనీరు ప్రవహిస్తూనే ఉందని ఈ నెలాఖరు నాటికి పూర్తిగా సమస్య తీరుతుందని భావిస్తున్నామని జగన్ పేర్కొన్నట్టు సమాచారం. గత ఐదేళ్లలో పేరుకు ఇసుక ఫ్రీ అని చెప్పి మాఫియా నడిపారని, ఇప్పుడు మేం చాలా పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తున్నామని ప్రజలకు, పేదలకు మేలు చేసేలా మార్గదర్శకాలు రూపొందించామని పేర్కొన్నారు. కిలోమీటర్కు రూ.4.90 లకు ఎవరైతే రవాణా చేస్తారో వారిని రమ్మన్నామని వరద తగ్గగానే ఇసుక సరఫరా బాగా పెరుగుతుందని జగన్ పేర్కొన్నారు. ప్రాధాన్యతా రంగాలకు ఇసుక ఇవ్వడానికి వెంటనే ప్రత్యేక స్టాక్యార్డులు కూడా ఇస్తామని ఆయన పేర్కొన్నారు.