తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా సాగింది. ప్రధానాంశం ఆర్టీసీ అయినప్పటికీ, 49 అంశాలపై చర్చించింది. దాదాపు ఐదు గంటల పాటు జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 1 నుంచి జూలై 1 వరకు డీఏ ను 3.144 శాతం పెంచాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీంతో ఉద్యగుల మొత్తం డీఏ 33.536 శాతానికి చేరుకుంటుంది. ఇక, రాష్ట్రంలో ప్లాస్టిక్ను నిషేధించాలనే విషయంపై కేబినెట్లో విస్తృత చర్చ జరిగింది. ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించి అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు అధికారుల కమిటీని నియమించాలని నిర్ణయించింది. కమిటీ నివేదిక ఇచ్చాక ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. మున్సిపల్ ఎన్నికలపైనా కేబినెట్ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. కోర్టు కేసులు పరిస్కారం అయ్యాకే మునిసిపల్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు సీఎం కేసీఆర్.
రాష్ట్రంలో కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటవడంతో వాటికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను కూడా పునర్వ్యవస్థీకరించాలని కేబినెట్ భావించింది. అందుకు అవసరమైన చర్యలను పరిశీలించాలని పోలీసు శాఖను మంత్రివర్గం కోరింది. శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.