అమరావతి: ఇసుక కొరతపై విపక్షాల ఆందోళనతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంత్రి పెద్దిరెడ్డి, అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కేవలం ఇసుక సమస్యపై వచ్చేవారం స్పందన కార్యక్రమం చేపట్టనున్నట్లు సీఎం తెలిపారు. స్పందనలో ఇసుక వారోత్సవం తేదీలు ప్రకటిస్తామన్నారు. వరద నీరు తగ్గగానే రీచ్ల నుంచి ఇసుక సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. కి.మీ.కు రూ.4.90 చొప్పున ఇసుక రవాణాకు అనుమతి ఇచ్చారు. ప్రతిపక్షాలు శవరాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఏ ఇష్యూ లేక ప్రతిపక్షాలు ఇసుక అంశాన్ని పట్టుకున్నాయని వ్యాఖ్యానించారు. పాలనకు సన్నద్ధమయ్యేలోగా ఆగస్టులో వరదలు వచ్చాయని పేర్కొన్నారు. 5 నెలల్లో 3 నెలలు వరదలే వచ్చాయని చెప్పారు.
పక్క రాష్ట్రాలకు ఇసుక తరలింపును అడ్డుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఇసుక ధర నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈలోగా ఆర్డినెన్స్ సిద్ధం చేయాలంటూ అధికారులకు సూచించారు. ఎక్కువ ధరకు అమ్మితే జైలుకు పంపేలా చట్టం తీసుకురావాలన్నారు. అలాగే టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని జగన్ ఆదేశించారు.